PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Monday, December 8, 2025

తేది:07-12-2025, "ఆంధ్రప్రభ" ఆదివారం సంచికలో... "వెలుగు కిరణాలు" కథ

8.బాలప్రభ కథ – వెలుగు కిరణాలు



























మూడవ తరగతి చదువుతున్న విజయ్ చాలా తెలివైన వాడు, చురుకైనవాడు. కాకపోతే ‘తండ్రి తాగుడే’ అతని బాల్య జీవితంలో ఏకైక శత్రువు.
తండ్రి రాజన్న రోజు కూలీ. డబ్బు బాగా సంపాదిస్తాడు. కానీ, మద్యానికి బానిస. తాగి వచ్చి నిష్కారణంగా భార్యను తిట్టడం, కొట్టడం ఇంట్లో నిత్యకృత్యం.

భార్య సీతమ్మ వ్యవసాయ కూలీ. తన సంపాదనతోనే ఇల్లు నెట్టుకొచ్చేది. విజయ్ తో పాటు మరో ఆడపిల్ల కూడా ఉంది. బిడ్డల కోసం భర్తను భరించక తప్పడం లేదు. ‘ఆవు చేలో మేస్తే దూడ గెట్టున మేస్తుందా?’ అన్న చందాన పరిస్ఠితి ఉన్నది.

చిన్న వయసులోనే విజయ్ ని కోపం, తిట్లు ఆవరించాయి. వాటిని ఇంటా, బయటా తోటి పిల్లలపై ప్రయోగించేవాడు. నిష్కారణ గొడవలకు దిగేవాడు. బడిలోనూ అంతే. బాధితులైన పిల్లల ఫిర్యాదులతో, టీచర్లు, తల్లిదండ్రులతో రోజూ దేహశుద్ధి జరిగేది.

ఎంత మందితో ఎన్ని తన్నులు తిన్నా సిగ్గూశరం లేదు. క్రమేణా శిక్షలకు అలవాటై రాటు దేలాడు. చేసేది లేక ఊరంతా విజయ్ ని ‘‘రౌడీ వెధవ’’ గా ముద్ర వేశారు. ‘దుష్టులకు దూరంగా ఉండమన్నారు కదా!’ పెద్దలు. అందుకే, వాడికి దూరంగా ఉండమని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పేవారు.

రెండేళ్ళు గడిచింది. ఇప్పుడు ఐదవ తరగతికి వచ్చాడు. బడి ప్రారంభంలోనే ఒక ఉపాధ్యాయుడు బదిలీ అయ్యారు. బదులుగా శ్రీధర్ అనే ఉపాధ్యాయుడు వచ్చాడు. ఎక్కడ పనిచేసినా అతనివి నాలుగే సూత్రాలు.

తాను చెప్పేది పిల్లలు వినేలా చేసుకోవడం.

వారిచే మాట్లాడింపజేయడం.

ఏ తెలుగు పుస్తకాన్ని ఎవరు ఇచ్చినా చూసి పిల్లలే చదవగలిగే టెక్నిక్స్ నేర్పడం.

మంచి దస్తూరితో వ్రాత నేర్పించడం.

ఈ క్రమంలో పిల్లలను తిట్టడు, కొట్టడు కూడా. పైగా కొత్త కొత్త విధానాలతో బోధన చేసేవాడు. పిల్లల్లో మంచి విలువలు నింప గల ఉత్తమ ఉపాధ్యాయుడు. నిత్యవిద్యార్థి. విద్యార్థులను మంచి బాట వైపు తీర్చి దిద్దగల నేర్పరి. ఆ సంవత్సరం శ్రీధర్ ని 4,5 తరగతులకు కేటాయించారు. మొదటి రోజు పిల్లలను పరిచయం చేసుకున్నాడు. గలగల శబ్దంలోనే సాగింది పరిచయం.

కథలు, కబుర్లు చెప్పాడు. పాటలు పాడాడు. పిల్లలకు కొత్తగా, ఆకర్షణీయంగా అనిపించింది. తరగతి గది కాస్త సద్దుమణిగింది. తన మాటలు/పాటలు ఆపగానే షరా మామూలైంది. సాయంత్రం కొత్త కొత్త ఆటలు కూడా ఆడిస్తూ, పిల్లల్లో మమేకం అవుతున్నాడు. మూడు రోజులు గడిచాయి. సారుపై అభిమానం మొలకలెత్తుతున్నది. తరగతిలో గోల కాస్త తగ్గుముఖం పట్టింది. కాస్త వినడానికి అలవాటు పడుతున్నారు. అడిగిన దానికి జవాబిస్తున్నారు. విజయ్ తో పాటు ఒక్కొక్కరి మనస్తత్వం కూడా తెలుస్తున్నది. చెస్, క్యారంబోర్డు, బ్రెయిన్విటా, జెంగా గేమ్ లాంటివి కొని తెస్తున్నాడు. వాటన్నిటినీ నేర్పిస్తూ పిల్లలను ఆకట్టుకుంటున్నాడు.

రెండు వారాల తరువాత శ్రీధర్ ఓ నోటుబుక్ తెచ్చాడు. పిల్లలకు చూపిస్తూ, ‘‘చూడండి పిల్లలూ! ఈ నోట్బుక్ నా డైరీ అన్నమాట. మీరు చేసే మంచి పనులకూ, సమాధానాలకూ పాయింట్స్ ఇస్తాను. అవి ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, 5, 10 కూడా ఇవ్వవచ్చు. మీరు చేసే పనిని బట్టి, మీ సమాధానాలను బట్టీ. వాటిని మీ పేరుతో డైరీలో వ్రాసుకుంటా. 50 పూర్తి కాగానే ఒక గిఫ్ట్, చూద్దాం ఎవరో ఫస్ట్. తరువాత 100 కు, 150 కి, ఇలా ఇస్తూనే ఉంటాను.’’ అన్నాడు. పిల్లలలంతా,‘‘హై, భలే భలే!’’ అంటూ సంబర పడ్డారు, విజయ్ తప్ప.

రోజూ సారు పాయింట్స్ వ్రాస్తున్నపుడు పిల్లలను దగ్గరికి పిలిచేవాడు. డైరీలో వారి పేరు గుండ్రంగా, అందంగా వ్రాస్తుంటే ,‘అబ్భ’ అంటూ పిల్లల కళ్ళల్లో మెరుపు వచ్చేది. విజయ్ మాత్రం వెళ్ళేవాడు కాదు. ఒక్కొక్కరికీ పాయింట్స్ వస్తున్నాయి.

‘‘ఆఁ..రాజు కరెక్టుగా చెప్పాడు. కాబట్టి, ఒక పాయింట్, చప్పట్లు కొట్టండీ’’,
‘‘రాధిక, చక్కగా 5 ఎక్కాలు చెప్పింది. సో, ఫైవ్ పాయింట్స్, కమాన్, చప్పట్లు కొట్టండీ’’
ఇలా అంటుంటే పిల్లల్లో ఉత్సాహం పెరిగి పోయేది. ఒక నెల తిరిగే సరికి, పిల్లలందరిలో వారికి తెలియకుండానే మార్పు వచ్చింది. కాస్త విజయ్ లో కూడా. ఫిర్యాదుల ఊసే లేదు. ఓరోజు సారు వరుసగా 5మంది విద్యార్థులకు పాయింట్స్ రాస్తున్నాడు. పిల్లలంతా చేరి చప్పట్లు మ్రోగిస్తున్నారు. ఈ సంఘటన విజయ్ మనసులో ప్రకంపనలు రేపింది.
ఉన్నట్లుండి ఓ రోజు విజయ్ లేచి,‘‘సార్, మీరు పాడిన ఆ పద్యం నేను పాడమంటారా?’’ అన్నాడు.

‘‘ఊ..పాడు’’ అనగానే అద్భుతంగా రాగయుక్తంగా పాడాడు.
వెంటనే ఉత్సాహంతో సారు,‘‘ వెరీ గుడ్. ఫైవ్ పాయింట్స్’’ అన్నాడు. ఊహించని ఈ పరిణామంతో విజయ్ పెదవులపై తెలియకుండా చిరునవ్వు మొలిచింది. తరగతి పిల్లల అందరి వైపు చూస్తూ ముఖంలో వెలుగులు నింపుకున్నాడు. తరగతి వాతావరణం మారిపోయింది. చప్పట్ల వర్షం కురిసింది. విజయ్ లో  నిద్రాణమై ఉన్న ఉత్సాహ బీజం మొలకలేసింది. ఆ రోజుటి నుండి అన్ని కార్యక్రమాలపై విజయ్ కి ఆసక్తి పెరిగింది. పిల్లలతో కలిసి పోయాడు. మూడు నెలల పరీక్షలో మంచి మార్కులు కూడా సాధించాడు. 50 పాయింట్లకు గిఫ్ట్ తెచ్చుకున్న పది మందిలో విజయ్ కూడా ఒకడైనాడు.

ఇప్పుడు సారు విజయ్ కి చిన్న చిన్న పనులు కూడా అప్పగిస్తున్నారు. ‘‘బోర్డు తుడిచేయ్ విజయ్ ’’, ‘‘ఈ పద్యం నువ్వైతే చాలా బాగా పాడతావు విజయ్’’ “ఇప్పుడు మన విజయ్ మీకు గేయానికి అభినయం చూపిస్తాడు” ఇలా మిగిలిన విద్యార్థులతో పాటు అతనిలో నమ్మకం నాటారు. తరువాత స్కూల్ నాటికలో కథకుడిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో కూడా తండ్రి వచ్చే లోపు నిద్ర పోతున్నాడు. కాలచక్రం గిర్రున తిరిగింది.
-౦-
ఆరోజు పాఠశాల వార్షికోత్సవం. తల్లిదండ్రులందరూ హాజరయ్యారు. పనులు కూడా మానేసిన రాజన్న తాగిన మత్తులోనే కార్యక్రమానికి హాజరయ్యాడు. నాటికలో కథకుడుగా విజయ్ ది మద్యం బానిసలకు బుద్ధి చెప్పే పాత్ర. ‘పెద్దల తప్పుల వలన పిల్లల జీవితాలు ఎలా చీకటి పాలవుతున్నాయో?’చెప్పడం. పాత్రలో విజయ్ లీనమైపోయి అద్భుతంగా జీవించాడు. ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నాడు. మత్తులో ఉన్న రాజన్నను కొడుకు వేషం, కళ్ళు విప్పార్ఛేలా చేసింది. అతనికి తెలియకుండానే కొడుకు వేషం చూడడానికి శరీరాన్ని నిటారుగా నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నించాడు. చాలావరకు సఫలమయ్యాడు.

స్జేజీపై కొడుకును చూసి ముగ్ధుడైనాడు. డైలాగ్స్ వినడానికి చెవులు రిక్కించాడు. విజయ్ డైలాగ్స్ తూటాల్లా పేలుతున్నాయి. ప్రేక్షకుల చప్పట్లు రాజన్న మత్తును తునాతునకలు చేస్తున్నాయి. నాటిక ముగియగానే, చప్పట్లు, కేరింతలు, ఈలలతో ఆ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్రీధర్ సార్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ కౌగిలించుకున్నాడు. సారు భుజం తట్టి ఓదర్చాడు. కార్యక్రమం ముగిసింది. రాజన్న మనసులో తప్పు చేశానన్న భావనకు బీజం పడింది. తరువాతి రోజు తాగి ఇంటికి వచ్చినా, గొడవ చేయలేదు.

ఆ బీజం మొలకలెత్తసాగింది. భార్యాబిడ్డలపై ప్రేమ, జాలి పెరగసాగాయి. ఈ మధ్య ఒక్కో రోజు అస్సలు తాగకుండా ఇంటికి వస్తున్నాడు. భార్య ఆశ్చర్యంతో నోరు తెరిచింది. కానీ, ఏమీ మాట్లాడకుండా తనలో తాను తెగ మురిసిపోయింది. కానీ, తన ఆశ్చర్యానికి సమాధానం దొరకలేదు. అనుకోకుండా ఒకరోజు రాజన్న ప్రమాదంలో గాయపడ్డాడు. హాస్పిటల్లో చేర్పించారు.

చికిత్స చేశాక బెడ్ పై పడుకోబెట్టారు. విజయ్, తండ్రి దగ్గరికి వెళ్ళి ,‘‘నాన్నా, నేను మారిపోయాను. నువ్వూ మారవచ్చు కదా!’’ అడిగాడు. ‘‘ మారి పోతానురా, కన్నా! మారిపోతా’’ నంటూ, భార్యా బిడ్డలను దగ్గరికి తీసుకున్నాడు. భోరుమని ఏడుస్తూ, కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంటికి చేరాక అతి తక్కువ కాలంలోనే మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు విజయ్ స్కూల్ లో ‘‘ఉత్తమ ప్రవర్తన గల విద్యార్థి’’గా గుర్తింపు పొందాడు. రాజన్నలో నూతన తేజం వచ్చింది. ఉపాధి పనుల్లో తిరిగి స్థిరపడ్డాడు. ఈ మార్పుకు మూలం ఒక్కటే. ఒక మంచి ఉపాధ్యాయుడు, ప్రేమతో చూపిన మార్గం.

ఓ మంచి ఉపాధ్యాయుడి ఆదర్శ బోధన ఒక విద్యార్థి జీవితానికి వెలుగు కిరణమైంది.
ఓ నాటికలోని పాత్ర మద్యం బానిసను తట్టిలేపిన ఇంకో వెలుగు కిరణం అయ్యింది.
ఓ వ్యక్తిలో వచ్చిన మార్పు అతని కుటుంబానికి మరో వెలుగు కిరణంగా మారింది.
ఇలా, కంటికి కనబడని ‘‘వెలుగు కిరణాలు’’ ఎన్నో?!



Monday, December 1, 2025

తేది:01-12-2025, సోమవారం.. సూర్య దినపత్రిక లో.. "విరిసిన మొగ్గలు" పుస్తకం పై సమీక్ష

తేది:01-12-2025, సోమవారం.. సూర్య దినపత్రిక లో.. "విరిసిన మొగ్గలు" అనే మా కంకణాలపల్లి విద్యార్థుల కథల సంకలనంపై  డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన సమ్రగ సమీక్ష



Sunday, November 30, 2025

ప్రజాశక్తి పత్రిక లో ప్రచురించబడిన కథ... "చదువు ప్రయోజనం"

 తేది:30-11-2025," స్నేహ" సండే మ్యాగజైన్ , ప్రజాశక్తి పత్రిక లో ప్రచురించబడిన కథ... "చదువు ప్రయోజనం"



బాలచెలిమి కథల పోటీలో గెలిచిన కథ.. "చిగురించిన విలువలు"

 



తేది: 01 -12-2025 , సోమవారం ప్రజాశక్తి దినపత్రికలో వచ్చిన వార్త...




Sunday, October 19, 2025

ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో "కృతజ్ఞత" కథ

 తేది: 19-10-2025, ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో నేను రచించిన "కృతజ్ఞత" కథ ప్రచురితమయ్యింది. . చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 


ఆ బడికి కొత్తగా వచ్చిన మాష్టారు సుబ్బారాయుడు. బడిలో టీచర్లంతా పెద్దసారు అంటూ గౌరవిస్తారు . ఆయన రోజూ అన్నం తినేముందు ఒక ముద్ద తీసి ఆకులోనో ,కాగితంలోనో ఉంచేవాడు. వెళ్ళి ఆటస్థలంలో ప్రహరీగోడకు దగ్గరగా ఒకచోట పెట్టడం అలవాటు. ఆ తరువాతే తన భోజనం. టీచర్లకు కొన్ని రోజులు వింతగా అనిపించినా ‘ఏమిటి?’ అని ఎవ్వరికీ అడగాలనిపించలేదు. తరువాత పట్టించుకోవడం మానేశారు. మాష్టారు పెట్టిన అన్నం ముద్ద కోసం కాకులు వచ్చేవి.అలవాటైన కాకులు కొన్నాళ్ళకు సరిగ్గా భోజన సమయానికి అక్కడ వాలేవి. క్రమక్రమంగా మాష్టారు అన్నం పెట్టే సమయానికి రావడం ప్రారంభం ఆయింది. ఆపై కొన్నాళ్ళకు అవి ఆయన వెంట నడుచుకుంటూ వెళ్ళేవి. దగ్గరగా ఉండేవి. ఆయన ఆ అన్నాన్ని అక్కడ పెట్టి చిరునవ్వుతో వెనుదిరిగి చూస్తూ వెళ్ళేవాడు. తృప్తిగా భోజనం చేసేవాడు. ఇదంతా ఆ బడిలోని 3వ తరగతి రాకేష్‌ నెలరోజులు పైగా గమనిస్తున్నాడు.
‘ఉత్త చేయిని విసిరితేనే కాకులు ఎగ్గిరిపోతయిగా. మరి, సారు దగ్గరేమో? ఎగరిపోవడం లేదేంటి?’ అని, ప్రతిరోజూ ఆశ్చర్యపోసాగాడు. ఆలోచన పెరిగిపోతున్నది. ఇది వరకు బడిలో అన్నం తిన్నాక తోటి పిల్లలతో ఆడుకునేవాడు. ఇప్పుడు ఆటలు మానేసి, ఓ ప్రక్కగా కూర్చుని ఆ విషయమే ఆలోచించసాగాడు. ఒకరోజు, ‘ఆఁ! ఐడియా! నేను కూడా కాకులకు అన్నం పెడితే?!.. ఊఁహు, ఆయన సారు కాబట్టి ఎవ్వరూ ఏమీ అనరు. నేను పెడితే అందరూ చూసి నవ్వుతారేమో? ఎగతాళి చేస్తారేమో? అసలు మనం అలా పెట్టవచ్చో? లేదో?’ ఇలా రోజూ ఏవో సందేహాలు చిన్ని బుఱ్ఱలో నాట్యమాడేవి.


ఒకనాడు ఇలాగే ఆలోచిస్తూ, ‘ఆఁ, ఇంటి దగ్గర తింటే. అమ్మో! సారోళ్ళు బడిలో తినకపోతే ఒప్పుకోరు. ఇంట్లో తిందామంటే, అమ్మ, అయ్య పనికిబోతరు.’ అనుకుంటూ ఉండగా, బెల్‌ మ్రోగింది. ఆలోచనలు పటాపంచలయ్యాయి. క్లాస్‌లోకి అందరితోపాటు పరిగెత్తిపోయాడు. తరగతి పనులలో నిమగ్నమయ్యాడు. ఆ తరువాత విషయమే గుర్తులేదు. ఆ తరువాతి రోజు మధ్యాహ్నం భోజనం గంట కొట్టారు. రాకేష్‌ మదిలో వెంటనే ముందుటి రోజు ఆలోచనలు కొనసాగాయి. బడిలో అన్నం తినడం, మాష్టారు`కాకుల దృశ్యాన్ని దూరం నుంచి చూడడం నిత్యకృత్యమైంది.

‘‘ఒరేయ్‌! రాకేష్‌, రారా! ఖోఖో ఆడదాం’’ తన క్లాస్‌మేట్‌ పిలిచాడు . ‘‘ఆఁహ! నేను రాను పోరా’’ అంటూ ఆలోచనల్లో మునిగిపోయాడు. పిలిచినవాడు,‘‘వాడు రాడంటరోయ్‌..’’ అనుకుంటూ వెళ్ళిపోయాడు. రాకేష్‌ ఆలోచనలు, నిర్లిప్తతలు నిత్యకృత్యమైపోయాయి.

మరో నెల రోజుల తర్వాత ఒకరోజు ఇలాగే నిరుత్సాహంగా కూర్చున్నాడు. ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తూ ఉన్నాడు.‘ఆఁ! ఐడియా. నాకు బడిలో అన్నం తినబుద్ధి కావడంలేదు. పొట్టనొప్పి వస్తుందని అమ్మతో చెబితే’ అనుకున్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే అమ్మతో చెప్పాడు. అమ్మ బడిలో సారుతో చెప్పింది. ఇంట్లో వండిపెట్టి పనికి పోతానంది. అనుకున్నట్లే జరగడంతో రాకేష్‌ ఆనందానికి అవధుల్లేవు.
తరువాతి రోజు తన ఇంట్లో ప్లేట్లో అన్నం పెట్టుకున్నాడు.

ఇంటి ముందు ఉన్న కానుక చెట్టు ఆకు తీసుకున్నాడు. అన్నం ముద్ద పెట్టి ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్ళాడు. కాకుల కోసం పైకి చూశాడు. ఎక్కడా ఒక్క కాకి కూడా కనబడడం లేదు. ఆకు అక్కడ పెట్టి కాస్త దూరంగా నిల్చున్నాడు. కాసేపు చూసి నిరాశతోనే అన్నం తిని బడికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చి చూస్తే అన్నం ఎండిపోయింది. తరువాతి రోజు కూడా అంతే. రోజూ ఇలా పెడుతూనే తింటున్నాడు. కొన్నాళ్ళు గడిచింది.

ఓరోజు యథావిధిగా రాకేష్‌ ఆకులో అన్నం పెట్టి వచ్చి తింటున్నాడు. ఇంతలో, ‘కావ్‌, కావ్‌’మనే శబ్దం వినపడిరది. గబుక్కున పరిగెత్తుకెళ్ళి చూశాడు. అక్కడో కాకి తను పెట్టిన అన్నం దగ్గరలో ఉంది. కానీ, అటూ, ఇటూ దిక్కులు చూస్తోంది. రాకేష్‌ ను చూసి చటుక్కున ఎగిరిపోయింది. రాకేష్‌ బాధ పడ్డాడు. తనను చూసి భయపడిందని అర్థమయింది. పక్కగా దాక్కున్నాడు. కొద్ది సేపటికి మరలా వచ్చిందా కాకి. అది అన్నం తింటుంటే తన మనసు ఎక్కడికో ఎగిరిపోతోంది. ఏదో చెప్పలేని హాయితో ముఖంలో వెలుగు, పెదవులపై చిరునవ్వు. ‘‘హే…య్‌’’ అంటూ ఎగ్గిరి గంతేసి అటు చూశాడు. అక్కడ కాకి లేదు. ఆనందం ఆవిరయ్యింది. ముఖంలో బాధ వెలిసింది.

తరువాతి రోజు నుండి అన్నం ఆకును అక్కడ పెట్టి వచ్చి చాటుగా చూడసాగాడు. అలాగే రోజూ సంతోషపడిపోతున్నాడు . కొన్నాళ్ళ తరువాత అన్నం ఆకు అక్కడ పెడదామని వెళుతున్నాడు. ఎదురుగా గోడపై కాకి. ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి. ఒక్క క్షణం ఆగాడు. మరలా ఎగిరిపోతుందేమో? అని ఆలోచించాడు. నెమ్మదిగా ఒక్క అడుగు ముందుకేశాడు. కాకి కాస్త పక్కకు జంప్‌ చేసింది. కానీ, ఎగిరిపోలేదు. ‘ఎగిరిపోతుందేమో’ నని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి నెమ్మదిగా కాకి వైపు చూడకుండా అక్కడ పెట్టాడు.

వెనుదిరిగాడు. దూరంగా వచ్చి చూశాడు. అక్కడ కాకి అన్నం తింటూ ఉంది. రాకేష్‌ కళ్ళలో ఆనందం, పెదవులపై చిరునవ్వు. ముఖంలో వెలుగు. తనకు తెలియకుండా ఆనందాన్ని పంచుకోవడానికి చుట్టూ చూశాడు. మరలా కాకి వైపు చూస్తూ సంతృప్తి పడ్డాడు. మరి కొన్ని రోజులకు బడిలో మాష్టారు అనుభవమే తనకు కూడా నిత్యకృత్యమయింది. ఓరోజు వాళ్ళమ్మ ,‘‘ఇప్పుడు బాగానే ఉంటుంది కదరా?! రేపటినుండి అన్నం బడిలోనే తింటావా? అక్కడ గుడ్డు, సాంబార్‌, పాయసం లాంటివి పెడతారు కదా. ఇంట్లో ఎక్కువగా పచ్చడి మెతుకులేనాయే!’’ అంది. రాకేష్‌ మౌనంగా ఉండిపోయాడు. మనసులో ఏమనుకుందో గానీ, తనను ఏమీ అనలేదు. పనికి వెళ్ళిపోయింది.

ఆరోజు బడికి సెలవు ఇచ్చారు. అమ్మా,నాన్నా పొలం పనులకు వెళ్ళారు. రాకేష్‌కు ఇంటి వద్ద ఒక్కడే ఉన్నాడు. బారెడు పొద్దు ఎక్కింది. అంబళ్ల పొద్దు దాటింది. ఏమీ తోచడం లేదు. ఊరి బయట అమ్మ పనిచేసే తమ పొలం వద్దకు బయలు దేరాడు. ఊరి పొలిమేర దాటాడు. చుట్టూ ఎవరూ కనబడడం లేదు. కాస్త భయంగా అనిపించి వెనక్కు వెళదామని అనుకున్నాడు. కానీ, మరలా బిక్కుబిక్కుమంటూ ముందుకే నడిచి వెళ్తున్నాడు. ఉన్నట్టుండి ఎక్కడి నుంచో ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చాడు.

రాకేష్‌ నోరును చటుక్కున మూసేసి చంకలోకి ఎత్తుకున్నాడు. వాడికి తోడు మరో ముసుగువాడున్నాడు. ఇద్దరూ కలిసి రాకేష్‌ను గబగబా ఎత్తుకుని పారిపోసాగారు. రాకేష్‌ కాళ్ళుచేతులు గిలగిలా కొట్టుకుంటున్నాడు. దుండగులు కొద్ది దూరం వెళ్ళగానే, రోడ్డు పక్క చెట్టుపై ఉన్న ఒక కాకి చూసింది. ‘కావు కావు’ మని అరిచి గాల్లోకి ఎగిరింది. దుండగుల వెంట పైన ఎగురుతూ ‘‘కావ్‌ కావ్‌’’మంటోంది. వాళ్లు మరో ఇరవై అడుగులు ముందుకు వేశాడు. కాకి అరుస్తూనే ఉంది.

ఇంతలో మరోకాకి వచ్చి ఆ కాకిని అనుసరించింది. ఇలా, వెంటవెంటనే కాకుల సంఖ్య పెరిగి గుంపులా తయారయ్యింది. ఇప్పుడు ఆ కాకులన్నీ ‘కావ్‌ కావ్‌’ మంటూ ఆ ముసుగువాళ్ళను పొడవసాగాయి. ఆ ధాటికి తట్టుకోలేక రాకేష్‌ను అక్కడే వదిలి పారిపోయారు. కొంత దూరం వరకు తరిమివేశాయి. అటునుండి అటే కాకులు పక్కకు వెళ్ళిపోసాగాయి. పరిగెత్తుతున్న దుండగులను చూస్తూ రాకేష్‌ ఆనందంతో చప్పట్టు కొట్టుకుంటూ గెంతులు వేయసాగాడు. కొద్ది క్షణాల్లో వాతావరణం మామూలుగా మారింది. రాకేష్‌లో ఇప్పుడు ఏదో తెలియని ధైర్యం నిండింది. ఎగురుకుంటూ పొలం వైపు అడుగులేశాడు.



Sunday, June 22, 2025

డాక్టర్ వంశీకృష్ణ గారితో(Dt:21st June 2025)

ఒంగోలు లోని శ్రీరామ్ super speciality హాస్పిటల్ ..MD&Artho. శ్రీ డాక్టర్ సి.హెచ్.వంశీకృష్ణ గారు పిల్లల విద్యాభివృద్ధిపై చూపిస్తున్న ఆసక్తికి.. ప్రతిస్పందనగా.. వారితో కొన్ని క్షణాలు ప్రస్తుత విద్యావిధానం గురించి చర్చించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలతో.... విశాలాంధ్ర పబ్లికేషన్స్ వారు ప్రచురించిన నా "నగరదిష్టి" అనే కథల పుస్తకాన్ని అందజేసిన మధుర క్షణాలు.. (తేది:21-06-2025, శనివారం)

-----------------------------------

2021 వ సంవత్సరంలో.. భారతదేశ ప్రభుత్వం అందజేస్తున్న "కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారానికి" మొదటి 10 స్థానాలలో ఒకటిగా నిలిచిన నా రచన ఈ "నగరదిష్టి"