PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Saturday, April 11, 2026

"మట్టిబండి" పుస్తక సమీక్ష...

 ఏప్రిల్ 2026 న 64kalalu.com వెబ్ పత్రిక లో నేను వ్రాసిన "మట్టిబండి" పుస్తక సమీక్ష...  " మట్టిబండి " పుస్తక సమీక్ష చదవడానికి దీనిపై క్లిక్ చేయండి.


ఐదు సంవత్సరాల కాలంలో ఐదు భాషలలో ముద్రింపబడి, 100 మంది స్పందనలను, విమర్శనాత్మక వ్యాసాలుగా "వరదగుడి" పేరున 305 పేజీలుగా ప్రచురింపబడి ఆదరణ పొందిన   గొప్ప రచన  "మట్టిబండి" (దీర్ఘ కవిత)
========================================================
రచన: భాషావిభ్హూషణ డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ
============
సమీక్షకులు : "నవ్యకవితాకళానిధి" మద్దిరాల శ్రీనివాసులు, ఒంగోలు , ఫోన్ : 901019066 
=============
"మట్టిబండి" అనే పేరులోనే... చెప్పకనే ఈ రచన ఒక రైతు గురించి అని తెలిసిపోతున్నది.  కాకపోతే  లోపలికి చూస్తే గానీ, ఇది ఒక భావోద్వేగభరితమైన రైతు దీనస్థితి గురించి అని అర్థమవదు. మట్టిబండి కి, రైతుకు ఉన్న అవినాభావ సంబంధం ఏమిటో? 42 పేజీల ఒక చక్కని దీర్ఘకవిత ద్వారా అద్భుతంగా ఆవిష్కరింపజేశారు రచయిత.  
ఎవరివైనా రచనలు ప్రారంభంలో ఒక విధంగా, మధ్యలో ఒక విధంగా, ముగింపులో మరో విధముగా ఉంటూ ఉంటాయి. కానీ, ఈ మట్టిబండి దీర్ఘకవిత లో మాత్రం ఆదినారాయణ గారు ఆద్యంతం రైతు జీవితాన్ని సజీవంగా శ్వాసింపజేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి పంక్తులను చూస్తే... 
మా పొలాన్ని అమ్మేశాను / చితిని చేరేవరకు/ బతుకులో భాగంగా ఉంటుందని/ భావిస్తూ వచ్చిన పొలాన్ని/భయపడుతూ/బాధపడుతూ అమ్మేశాను.... 
చూడండి..  ఈ పంక్తుల రచనా శైలి నాకైతే.... రామాయణంలోని ఒక మధుర ఘట్టాన్ని గుర్తు తెచ్చింది. సీతమ్మ జాడ కోసం ఆంజనేయస్వామి లంకను దాటి వెళ్ళాడు కదా. అక్కడ అమ్మను చూసిన ఆనందాన్ని తిరిగి రాగానే ఎదురు చూస్తున్న వారితో ఆకాశం నుండి కిందకు రాకముందే, "చూశాను" అన్నాడట. అంటే విషయం అర్థమైపోయింది. అందరూ ఆనందపడ్డారు. ఆ తరువాత జరిగిన పూర్తి విషయం కూలంకషంగా వివరించాడు.
అదేవిధముగా, ఇక్కడ కూడా రచయిత, "మా పొలాన్ని అమ్మేశాను" అని మొదలుపెట్టి, ఆ నిర్ణయపు వేదనను మలి పదాలలో విప్పి చెబుతూ  రామాయణ ఘట్టాన్ని స్మరింపజేశారు. రచనా శైలి ఒక మచ్చు తునకైతే, దానిని ఎందుకు అమ్మేశాడో చెప్పిన విధానం రైతు ఆర్తిని పాఠకుల హృదయాల్లో కన్నీటి తరంగాలుగా మలుస్తుంది.
మరోచోట, " ఎత్తయిన మూపురాలు /రాజసం కనిపించే నడకలు / నడకకు లయబద్ధంగా ఊగే గంగడోళ్ళు / కాటుక దిద్దినట్లున్న కళ్ళు/ ఎంత అందంగా, హుందాగా ఉండేవో" . "ఒంగోలు జాతి ఎడ్లు కదా!" అని ముగింపు పలికే వేళ, ఆ ఎడ్ల సౌందర్యాన్ని మాత్రమే కాదు, రైతు మనసులోని మమకారాన్ని కూడా సజీవంగా చిత్రిస్తారు. ప్రతి పదం ఒక దృశ్యమై, మన కళ్ల ముందు నాట్యం చేస్తుంది. ఇది శ్రీనాధ మహాకవి వర్ణనా వైభవాన్ని తలపిస్తుంది.. 
ఇదొక్క కవితే కాదు... పుస్తకమంతా అద్భుతమైన వర్ణనల ప్రవాహంగా సాగుతుంది. ఒకసారి ఈ పుస్తకాన్ని తెరిచిన పాఠకుడు, ఆద్యంతం లీనమై, పరకాయ ప్రవేశం చేయక మానడు అని ధైర్యంగా చెప్పగలను.

ఇంకో చోట "రైతుబంధు రంగ / మా ఊరు వచ్చినప్పుడు / ఈ బండి మీదనే ఎక్కించి / ఊరేగించి, సత్కరించాం" అన్న పంక్తుల్లో, బండి జ్ఞాపకాల్లో రైతు కన్నీళ్లలో ఆనందభాష్పాల మెరుపులు కరిగిపోతాయి. ఆ అనుభూతి పాఠకుడి హృదయానికీ చేరుతుంది.
"గొడ్లు కాసుకునే బుడ్డోళ్ళు..." అంటూ బాల్యపు ఆహ్లాదాన్ని, దర్పాన్ని, అమాయకత్వాన్ని మదపుటేనుగు, ఐరావతంతో పోల్చిన తీరు—దీనస్థితిలోనూ చిలిపితనాన్ని కోల్పోని జీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది.
"కూటిని చల్లతో కలగలిపి..." అంటూ తాతగారి సాదాసీదా భోజనానుభవాన్ని "మోహిని చేతి భాండం నుండి జాలువారే అమృతం"తో పోల్చిన తీరు భాగవత, విష్ణుపురాణాల సుగంధాన్ని వెదజల్లుతుంది. ఇది కవిత కాదనిపించేంత సహజానుభవం.
పురాణపరిజ్ఞానం, సాహిత్యాస్వాదన, రైతుబిడ్డగా జీవించిన అనుభవం—ఈ మూడు కలిసినపుడే ఇలాంటి కవిత జన్మిస్తుంది. అందుకే ఈ దీర్ఘకవిత ఆద్యంతం రక్తికట్టింది. ఊహకు అందని నిజజీవితం ఇక్కడ పలికింది.
ఇందులో రైతు జీవితం మాత్రమే కాదు—అక్కతమ్ముళ్ళ అనుబంధం, పల్లె వైద్యం, గడ్డివాములు, పంట నూర్పిడి, బాల్యపు ఆటలు, జంతువులతో మమకారం—అన్నీ కలగలిసి నవరసభరిత కావ్యంగా వికసించాయి.
తరాలు మారినా రైతు జీవితం మాత్రం "ఎక్కడ వేసిన గొంగళి అక్కడే" అన్నట్లే ఉందని ఈ కవిత మనకు చెబుతుంది. ఇది వాస్తవం కూడా కదా! ఇతర వృత్తులవారు తమ కూలీని తామే నిర్ణయించుకోగలిగినా, రైతుకు మాత్రం తన పంటకు ధర నిర్ణయించే హక్కు లేకపోవడం బాధాకరం. ఈ విషాదాన్ని అభిమన్యుని పోరాటంతో పోల్చిన తీరు సార్థకం.
ఈ నవరసభరిత రచన గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్నా, పెద్ద అందరూ చదవాల్సిన గ్రంథం. తక్కువ కాలంలోనే మూడు ముద్రణలు పొందిన ఈ రచన, తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళ భాషల్లో వెలుగొందుతూ, త్వరలో కన్నడలోనూ వికసించబోతోంది. ఇదే "మట్టిబండి" శక్తి. ముఖచిత్రాన్ని చంద్రమోహన్ గారు చక్కగా ఆవిష్కరించారు.
ప్రముఖ రచయిత, ప్రకాశం జిల్లా గీతరచయిత శ్రీ నాగభైరవ కోటేశ్వరరావు గారి సోదరుడు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారి అద్భుత ఆవిష్కరణయైన ఈ రచన గూర్చి, ముందుమాటలలో రచయితతో పాటు మాజీ మంత్రి శ్రీమతి గల్లా అరుణకుమారి గారు, ప్రముఖ వక్త, రిటైర్డ్ తెలుగు భాషోపన్యాసకులు డాక్టర్ బీరం సుందరరావు గారు, ఎం.పి. శ్రీ గల్లా జయదేవ్ గారు, ఎన్.జి.రంగ ఫౌండేషన్ డాక్టర్ జక్కంపూడి సీతారామారావు గారు, సరస్వతీ పుత్ర, కళారత్న డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గార్లు అందించిన అద్భుతమైన వ్యాఖ్యలు మణిమకుటాలవంటివి. కాగా,
మరొక గొప్ప విశేషమేమంటే, ఈ పుస్తకం ముద్రింపబడిన అతి తక్కువ కాలంలో ఎందరో పెద్దలు, విశ్వవిద్యాలయ ఆచార్యులు, సాహితీ ప్రముఖులు, రచయితలు, విమర్శకులు, గురువులు, రచయిత ఆప్తమిత్రులు, శిష్యులు, అపరిచితులు, అభిమానులు, సహాధ్యాయులు, పత్రికల వారు , నాతో కలిపి 100 మంది చేత సుదీర్ఘమైన విశ్లేషనాత్మక సమీక్షలు రావడం నభూతో న భవిష్యత్.. పైగా వాటన్నిటినీ క్రోడీకరించి "వరదగుడి" పేరుతో ఆదినారాయణ మాష్టారు 305 పేజీల పుస్తకంగా కూడా ముద్రించడం నిజంగా విశేషమే..కదా.  42  పేజీల రచనకు 300 పేజీల సమీక్షలు.. బాప్ రే.. 
ఏ పాఠకుడినైనా ఏకబిగిన చదివించే ఈ పుస్తకాన్ని ఎన్.జి.రంగ ఫౌండేషన్, గుంటూరు వారు జనవరి 2024లో తృతీయ ముద్రణగా 500 కాపీలుగా అందుబాటులోకి తెచ్చారు. కావలసిన వారు
1. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, 202, శ్రీ వెంకటసాయి రెసిడెన్సీ, 2వ లైను, రామయ్యనగర్, ఒంగోలు-2, ప్రకాశం జిల్లా, ఫోన్: 98497 99711 (మరియు )
2. శ్రీ ఏనుగు అంకమనాయుడు, 18, ఎమ్.కె.నాయుడు కాలనీ, తిరుపతి - 517 501, ఫోన్: 8919676459 వద్ద నుండి పొందవచ్చును.
================= 
మీ "నవ్యకవితాకళానిధి" మద్దిరాల శ్రీనివాసులు, ఒంగోలు.



"బహుమతుల కాకి" పుస్తక సమీక్ష

 మార్చి2026  నెలలో 64kalalu.com వెబ్ పత్రికలో నేను వ్రాసిన "బహుమతుల కాకి" పుస్తక సమీక్ష

బహుమతుల కాకి పుస్తక సమీక్ష                                                     


విలువలు – విజ్ఞానం – వినోదం కలగలిపిన బాలసాహిత్య రత్నం “బహుమతుల కాకి” కథా సంపుటి.

నేటి డిజిటల్ ప్రపంచంలో పిల్లల దృష్టి ఎక్కువగా తెరలపైనే కేంద్రీకృతమవుతున్నది. అలాంటి ఈ కాలంలో, మంచి పుస్తకం చేతిలో పడితే వారి ఊహాశక్తి, ఆలోచనా ధోరణి, భావోద్వేగాలు, పిల్లల సున్నితత్వం మరింత వికసిస్తాయి. అలాంటి పఠనానుభూతిని అందించే బాలల కథాసంపుటి “బహుమతుల కాకి”. నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్న విజ్ఞాన ప్రచురణల వారు ఈ గ్రంథాన్ని ప్రచురించారు. బాలల మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకున్న కథా రచయిత “టి.వి. రామకృష్ణ గారు” ఈ సంకలనంలో మొత్తం 15 కథలను అందించారు. డిసెంబర్ 2025లో తొలి ముద్రణగా 1000 ప్రతులు వెలువడటం ఈ పుస్తకంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం.

ఈ కథాసంపుటి ప్రత్యేకత ఏమిటంటే – ప్రతి కథలో వినోదం వెనుక ఒక విలువ దాగి ఉంటుంది; ప్రతి సంఘటన వెనుక ఒక జీవనపాఠం నిలుస్తుంది. ఉపదేశాత్మక ధోరణి కాకుండా, అనుభూతి ద్వారా పిల్లలకు సందేశాన్ని అందించడం అనేది ఈ రచయిత నైపుణ్యం.

ప్రకృతి – స్నేహం – మనసుల మమకారం
“బహుమతుల కాకి” అనే తొలి కథలో చిన్నారి మేఘన మరియు ఒక కాకి మధ్య ఏర్పడిన అమాయక స్నేహాన్ని హృద్యంగా ఆవిష్కరింపజేశారు. ప్రకృతితో మమేకమవడం, జీవరాశుల పట్ల కరుణ చూపడం, నిరీక్షణలోని ప్రేమ – ఇవన్నీ కథలో సహజంగా అనిపిస్తాయి. పిల్లలు చదివేటప్పుడు తాము కూడా ఆ చెట్టు క్రింద కూర్చున్నట్టుగా అనుభూతి చెందుతారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

“అభయ్ ఆలోచన”, “మధులిక పుట్టినరోజు” వంటి కథలు ప్రకృతి, పల్లె జీవన వాతావరణం, జంతు–పక్షుల ప్రపంచం పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయి. ఈ కథలు పిల్లలలో పరిశీలనా దృష్టిని పెంచుతాయి.

విజ్ఞాన ప్రేరణ – సృజనాత్మక దిశ
“ఆకాశంలో పక్షులు – జంతువులు” కథ ఖగోళ విజ్ఞానంపై ఆసక్తిని కలిగిస్తుంది. తాతయ్య ఇచ్చిన టెలిస్కోప్ ఒక సాధారణ బహుమతి మాత్రమే కాదు – అది చిన్నారులలో  జ్ఞానాన్వేషణకు పునాది వేస్తుంది.

“కృత్రిమ మేధా” కథలో భవిష్యత్ విద్యావిధానాల రూపురేఖలను రచయిత చక్కగా ఊహించారు. ఇందులో  సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలకు భయపెట్టే విధంగా కాకుండా, నేర్చుకోవడానికి ఉపకరించే సాధనంగా చూపించడం ప్రశంసనీయం.

ధైర్యం – వ్యక్తిత్వ వికాసం
“పప్పు సాహసం” కథ స్నేహం, ధైర్యం, సమయస్ఫూర్తి విలువలను బలంగా ప్రతిపాదిస్తుంది.
“మార్పు కోరిన కాలుడు” కథ ఇతరులను అనుకరించాలనే కోరిక వెనుక ఉన్న అపోహలను చెదరగొట్టి, స్వీయ సామర్థ్యాన్ని గుర్తించుకోవాలని సూచిస్తుంది.

“విరబూసిన బంతి చెట్టు” కథలో మొక్కల పట్ల ప్రేమను పెంపొందించేందుకు రచయిత ప్రయత్నించారు. శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్ అభిప్రాయాన్ని కథలో సున్నితంగా మేళవించి చెప్పడం చాలా బాగా అనిపించింది.

చరిత్ర – సంస్కృతి – కుటుంబ విలువలు
“దుర్గాబాయి” కథ ద్వారా దుర్గాబాయి దేశ్‌ముఖ్ జీవిత స్ఫూర్తిని పరిచయం చేశారు. చిన్నారులకి చరిత్రను భారంగా కాకుండా ప్రేరణాత్మకంగా అందించడం అభినందనీయం.

“క్షీరసాగర మథనం” కథ పురాణ గాథను బాలల భాషలో సరళంగా వివరిస్తుంది.
“చంటిగాడు” కథ కుటుంబ జీవనంలోని అల్లరిని, అనుబంధాన్ని ముద్దుగా చూపిస్తుంది.

రూపకల్పన ప్రత్యేకత
ఈ పుస్తకంలోని ప్రతి కథకు జతచేసిన ఆకర్షణీయమైన ఏఐ చిత్రాలు కథానుభూతిని మరింత సజీవంగా మారుస్తాయి. చిత్రాలు పిల్లల ఊహాశక్తిని విస్తరింపజేస్తాయి. భాష సరళంగానూ,  వాక్య నిర్మాణం సూటిగా సులభ గ్రాహ్యంగానూ ఉన్నది. మంచి చక్కటి పిల్లలకు ఆకషణీయమైన రీతిలో చక్కటి ముఖచిత్రాన్ని కూడా అందించారు. రంగు కూడా ప్రకృతిని సూచించేలా ఉన్నది.
చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే, “బహుమతుల కాకి” కేవలం కథల సంకలనం కాదు; అది పిల్లల మనసుల్లో విలువల విత్తనాలు నాటే పుస్తకం. ప్రకృతి ప్రేమ, విజ్ఞానం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, కుటుంబ అనుబంధం – ఇవన్నీ ఒకే గ్రంథంలో సమన్వయమై ఉండటం ఇందులోని విశేషం.

తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పఠనానుభూతి అందించాలనుకుంటే, ఉపాధ్యాయులు తమ పిల్లలను మంచి విజ్ఞానదాయకులుగా రూపుదిద్దాలనుక్కున్నా..  గ్రంథాలయంలో చేర్చదగిన మంచి పుస్తకం కోసం వెతుకుతుంటే – “బహుమతుల కాకి” సరైన ఎంపిక.

ఈ పుస్తకం ధర కేవలము రూ.120/- మాత్రమే. పుస్తకాన్ని పొందదలచిన వారు సంప్రదించవలసిన చిరునామా: జి. మాల్యాద్రి
విజ్ఞాన ప్రచురణలు,
ప్రజా సైన్స్ వేదిక ప్రచురణల విభాగం
162, విజయలక్ష్మీ నగర్, నెల్లూరు – 524004
సెల్: 9440503061

చిన్నారుల చేతిలో మంచి పుస్తకం ఉంటే – వారి భవిష్యత్తు మరింత ప్రకాశవంతం అవుతుంది. ఆ ప్రకాశానికి ఒక చిన్న దీప్తి “బహుమతుల కాకి”.
……………….
సమీక్ష : “నవ్యకవితాకళానిధి” మద్దిరాల శ్రీనివాసులు
ఉపాధ్యాయుడు, రచయిత (cell:9010619066)



డా.వంశీకృష్ణ గారితో

 తేది:08-04-2026, బుధవారము డా.వంశీకృష్ణ గారికి నా తాజా రచన "బాలల ప్రపంచం" పుస్తకాన్ని అందజేస్తూ




ప్రముఖ రచయిత దాసరి అమరేంద్ర & ప్రముఖ బాలసాహిత్య రచయిత VR శర్మ గార్లతో

 ప్రముఖ రచయిత దాసరి అమరేంద్ర & ప్రముఖ బాలసాహిత్య రచయిత VR శర్మ గార్లతో తేది:07-04-2026, మంగళవారము సాయంత్రం ఒంగోలు లోని మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్ ఆవరణలో గడిపిన మధుర క్షణాలు. అమరేంద్ర గారి నూతన రచన "రస్కిన్ బాండ్" ఆత్మకథ అనువాద పుస్తకం (ఓ ఏకాంతజీవి బ్రతుకాట) గురించిన కబుర్లతో.. డాక్టర్ CA ప్రసాద్ గారి ఆధ్యర్యంలో జరిగినది.













Monday, December 8, 2025

తేది:07-12-2025, "ఆంధ్రప్రభ" ఆదివారం సంచికలో... "వెలుగు కిరణాలు" కథ

8.బాలప్రభ కథ – వెలుగు కిరణాలు



























మూడవ తరగతి చదువుతున్న విజయ్ చాలా తెలివైన వాడు, చురుకైనవాడు. కాకపోతే ‘తండ్రి తాగుడే’ అతని బాల్య జీవితంలో ఏకైక శత్రువు.
తండ్రి రాజన్న రోజు కూలీ. డబ్బు బాగా సంపాదిస్తాడు. కానీ, మద్యానికి బానిస. తాగి వచ్చి నిష్కారణంగా భార్యను తిట్టడం, కొట్టడం ఇంట్లో నిత్యకృత్యం.

భార్య సీతమ్మ వ్యవసాయ కూలీ. తన సంపాదనతోనే ఇల్లు నెట్టుకొచ్చేది. విజయ్ తో పాటు మరో ఆడపిల్ల కూడా ఉంది. బిడ్డల కోసం భర్తను భరించక తప్పడం లేదు. ‘ఆవు చేలో మేస్తే దూడ గెట్టున మేస్తుందా?’ అన్న చందాన పరిస్ఠితి ఉన్నది.

చిన్న వయసులోనే విజయ్ ని కోపం, తిట్లు ఆవరించాయి. వాటిని ఇంటా, బయటా తోటి పిల్లలపై ప్రయోగించేవాడు. నిష్కారణ గొడవలకు దిగేవాడు. బడిలోనూ అంతే. బాధితులైన పిల్లల ఫిర్యాదులతో, టీచర్లు, తల్లిదండ్రులతో రోజూ దేహశుద్ధి జరిగేది.

ఎంత మందితో ఎన్ని తన్నులు తిన్నా సిగ్గూశరం లేదు. క్రమేణా శిక్షలకు అలవాటై రాటు దేలాడు. చేసేది లేక ఊరంతా విజయ్ ని ‘‘రౌడీ వెధవ’’ గా ముద్ర వేశారు. ‘దుష్టులకు దూరంగా ఉండమన్నారు కదా!’ పెద్దలు. అందుకే, వాడికి దూరంగా ఉండమని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పేవారు.

రెండేళ్ళు గడిచింది. ఇప్పుడు ఐదవ తరగతికి వచ్చాడు. బడి ప్రారంభంలోనే ఒక ఉపాధ్యాయుడు బదిలీ అయ్యారు. బదులుగా శ్రీధర్ అనే ఉపాధ్యాయుడు వచ్చాడు. ఎక్కడ పనిచేసినా అతనివి నాలుగే సూత్రాలు.

తాను చెప్పేది పిల్లలు వినేలా చేసుకోవడం.

వారిచే మాట్లాడింపజేయడం.

ఏ తెలుగు పుస్తకాన్ని ఎవరు ఇచ్చినా చూసి పిల్లలే చదవగలిగే టెక్నిక్స్ నేర్పడం.

మంచి దస్తూరితో వ్రాత నేర్పించడం.

ఈ క్రమంలో పిల్లలను తిట్టడు, కొట్టడు కూడా. పైగా కొత్త కొత్త విధానాలతో బోధన చేసేవాడు. పిల్లల్లో మంచి విలువలు నింప గల ఉత్తమ ఉపాధ్యాయుడు. నిత్యవిద్యార్థి. విద్యార్థులను మంచి బాట వైపు తీర్చి దిద్దగల నేర్పరి. ఆ సంవత్సరం శ్రీధర్ ని 4,5 తరగతులకు కేటాయించారు. మొదటి రోజు పిల్లలను పరిచయం చేసుకున్నాడు. గలగల శబ్దంలోనే సాగింది పరిచయం.

కథలు, కబుర్లు చెప్పాడు. పాటలు పాడాడు. పిల్లలకు కొత్తగా, ఆకర్షణీయంగా అనిపించింది. తరగతి గది కాస్త సద్దుమణిగింది. తన మాటలు/పాటలు ఆపగానే షరా మామూలైంది. సాయంత్రం కొత్త కొత్త ఆటలు కూడా ఆడిస్తూ, పిల్లల్లో మమేకం అవుతున్నాడు. మూడు రోజులు గడిచాయి. సారుపై అభిమానం మొలకలెత్తుతున్నది. తరగతిలో గోల కాస్త తగ్గుముఖం పట్టింది. కాస్త వినడానికి అలవాటు పడుతున్నారు. అడిగిన దానికి జవాబిస్తున్నారు. విజయ్ తో పాటు ఒక్కొక్కరి మనస్తత్వం కూడా తెలుస్తున్నది. చెస్, క్యారంబోర్డు, బ్రెయిన్విటా, జెంగా గేమ్ లాంటివి కొని తెస్తున్నాడు. వాటన్నిటినీ నేర్పిస్తూ పిల్లలను ఆకట్టుకుంటున్నాడు.

రెండు వారాల తరువాత శ్రీధర్ ఓ నోటుబుక్ తెచ్చాడు. పిల్లలకు చూపిస్తూ, ‘‘చూడండి పిల్లలూ! ఈ నోట్బుక్ నా డైరీ అన్నమాట. మీరు చేసే మంచి పనులకూ, సమాధానాలకూ పాయింట్స్ ఇస్తాను. అవి ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, 5, 10 కూడా ఇవ్వవచ్చు. మీరు చేసే పనిని బట్టి, మీ సమాధానాలను బట్టీ. వాటిని మీ పేరుతో డైరీలో వ్రాసుకుంటా. 50 పూర్తి కాగానే ఒక గిఫ్ట్, చూద్దాం ఎవరో ఫస్ట్. తరువాత 100 కు, 150 కి, ఇలా ఇస్తూనే ఉంటాను.’’ అన్నాడు. పిల్లలలంతా,‘‘హై, భలే భలే!’’ అంటూ సంబర పడ్డారు, విజయ్ తప్ప.

రోజూ సారు పాయింట్స్ వ్రాస్తున్నపుడు పిల్లలను దగ్గరికి పిలిచేవాడు. డైరీలో వారి పేరు గుండ్రంగా, అందంగా వ్రాస్తుంటే ,‘అబ్భ’ అంటూ పిల్లల కళ్ళల్లో మెరుపు వచ్చేది. విజయ్ మాత్రం వెళ్ళేవాడు కాదు. ఒక్కొక్కరికీ పాయింట్స్ వస్తున్నాయి.

‘‘ఆఁ..రాజు కరెక్టుగా చెప్పాడు. కాబట్టి, ఒక పాయింట్, చప్పట్లు కొట్టండీ’’,
‘‘రాధిక, చక్కగా 5 ఎక్కాలు చెప్పింది. సో, ఫైవ్ పాయింట్స్, కమాన్, చప్పట్లు కొట్టండీ’’
ఇలా అంటుంటే పిల్లల్లో ఉత్సాహం పెరిగి పోయేది. ఒక నెల తిరిగే సరికి, పిల్లలందరిలో వారికి తెలియకుండానే మార్పు వచ్చింది. కాస్త విజయ్ లో కూడా. ఫిర్యాదుల ఊసే లేదు. ఓరోజు సారు వరుసగా 5మంది విద్యార్థులకు పాయింట్స్ రాస్తున్నాడు. పిల్లలంతా చేరి చప్పట్లు మ్రోగిస్తున్నారు. ఈ సంఘటన విజయ్ మనసులో ప్రకంపనలు రేపింది.
ఉన్నట్లుండి ఓ రోజు విజయ్ లేచి,‘‘సార్, మీరు పాడిన ఆ పద్యం నేను పాడమంటారా?’’ అన్నాడు.

‘‘ఊ..పాడు’’ అనగానే అద్భుతంగా రాగయుక్తంగా పాడాడు.
వెంటనే ఉత్సాహంతో సారు,‘‘ వెరీ గుడ్. ఫైవ్ పాయింట్స్’’ అన్నాడు. ఊహించని ఈ పరిణామంతో విజయ్ పెదవులపై తెలియకుండా చిరునవ్వు మొలిచింది. తరగతి పిల్లల అందరి వైపు చూస్తూ ముఖంలో వెలుగులు నింపుకున్నాడు. తరగతి వాతావరణం మారిపోయింది. చప్పట్ల వర్షం కురిసింది. విజయ్ లో  నిద్రాణమై ఉన్న ఉత్సాహ బీజం మొలకలేసింది. ఆ రోజుటి నుండి అన్ని కార్యక్రమాలపై విజయ్ కి ఆసక్తి పెరిగింది. పిల్లలతో కలిసి పోయాడు. మూడు నెలల పరీక్షలో మంచి మార్కులు కూడా సాధించాడు. 50 పాయింట్లకు గిఫ్ట్ తెచ్చుకున్న పది మందిలో విజయ్ కూడా ఒకడైనాడు.

ఇప్పుడు సారు విజయ్ కి చిన్న చిన్న పనులు కూడా అప్పగిస్తున్నారు. ‘‘బోర్డు తుడిచేయ్ విజయ్ ’’, ‘‘ఈ పద్యం నువ్వైతే చాలా బాగా పాడతావు విజయ్’’ “ఇప్పుడు మన విజయ్ మీకు గేయానికి అభినయం చూపిస్తాడు” ఇలా మిగిలిన విద్యార్థులతో పాటు అతనిలో నమ్మకం నాటారు. తరువాత స్కూల్ నాటికలో కథకుడిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో కూడా తండ్రి వచ్చే లోపు నిద్ర పోతున్నాడు. కాలచక్రం గిర్రున తిరిగింది.
-౦-
ఆరోజు పాఠశాల వార్షికోత్సవం. తల్లిదండ్రులందరూ హాజరయ్యారు. పనులు కూడా మానేసిన రాజన్న తాగిన మత్తులోనే కార్యక్రమానికి హాజరయ్యాడు. నాటికలో కథకుడుగా విజయ్ ది మద్యం బానిసలకు బుద్ధి చెప్పే పాత్ర. ‘పెద్దల తప్పుల వలన పిల్లల జీవితాలు ఎలా చీకటి పాలవుతున్నాయో?’చెప్పడం. పాత్రలో విజయ్ లీనమైపోయి అద్భుతంగా జీవించాడు. ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నాడు. మత్తులో ఉన్న రాజన్నను కొడుకు వేషం, కళ్ళు విప్పార్ఛేలా చేసింది. అతనికి తెలియకుండానే కొడుకు వేషం చూడడానికి శరీరాన్ని నిటారుగా నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నించాడు. చాలావరకు సఫలమయ్యాడు.

స్జేజీపై కొడుకును చూసి ముగ్ధుడైనాడు. డైలాగ్స్ వినడానికి చెవులు రిక్కించాడు. విజయ్ డైలాగ్స్ తూటాల్లా పేలుతున్నాయి. ప్రేక్షకుల చప్పట్లు రాజన్న మత్తును తునాతునకలు చేస్తున్నాయి. నాటిక ముగియగానే, చప్పట్లు, కేరింతలు, ఈలలతో ఆ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్రీధర్ సార్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ కౌగిలించుకున్నాడు. సారు భుజం తట్టి ఓదర్చాడు. కార్యక్రమం ముగిసింది. రాజన్న మనసులో తప్పు చేశానన్న భావనకు బీజం పడింది. తరువాతి రోజు తాగి ఇంటికి వచ్చినా, గొడవ చేయలేదు.

ఆ బీజం మొలకలెత్తసాగింది. భార్యాబిడ్డలపై ప్రేమ, జాలి పెరగసాగాయి. ఈ మధ్య ఒక్కో రోజు అస్సలు తాగకుండా ఇంటికి వస్తున్నాడు. భార్య ఆశ్చర్యంతో నోరు తెరిచింది. కానీ, ఏమీ మాట్లాడకుండా తనలో తాను తెగ మురిసిపోయింది. కానీ, తన ఆశ్చర్యానికి సమాధానం దొరకలేదు. అనుకోకుండా ఒకరోజు రాజన్న ప్రమాదంలో గాయపడ్డాడు. హాస్పిటల్లో చేర్పించారు.

చికిత్స చేశాక బెడ్ పై పడుకోబెట్టారు. విజయ్, తండ్రి దగ్గరికి వెళ్ళి ,‘‘నాన్నా, నేను మారిపోయాను. నువ్వూ మారవచ్చు కదా!’’ అడిగాడు. ‘‘ మారి పోతానురా, కన్నా! మారిపోతా’’ నంటూ, భార్యా బిడ్డలను దగ్గరికి తీసుకున్నాడు. భోరుమని ఏడుస్తూ, కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంటికి చేరాక అతి తక్కువ కాలంలోనే మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు విజయ్ స్కూల్ లో ‘‘ఉత్తమ ప్రవర్తన గల విద్యార్థి’’గా గుర్తింపు పొందాడు. రాజన్నలో నూతన తేజం వచ్చింది. ఉపాధి పనుల్లో తిరిగి స్థిరపడ్డాడు. ఈ మార్పుకు మూలం ఒక్కటే. ఒక మంచి ఉపాధ్యాయుడు, ప్రేమతో చూపిన మార్గం.

ఓ మంచి ఉపాధ్యాయుడి ఆదర్శ బోధన ఒక విద్యార్థి జీవితానికి వెలుగు కిరణమైంది.
ఓ నాటికలోని పాత్ర మద్యం బానిసను తట్టిలేపిన ఇంకో వెలుగు కిరణం అయ్యింది.
ఓ వ్యక్తిలో వచ్చిన మార్పు అతని కుటుంబానికి మరో వెలుగు కిరణంగా మారింది.
ఇలా, కంటికి కనబడని ‘‘వెలుగు కిరణాలు’’ ఎన్నో?!



Monday, December 1, 2025

తేది:01-12-2025, సోమవారం.. సూర్య దినపత్రిక లో.. "విరిసిన మొగ్గలు" పుస్తకం పై సమీక్ష

తేది:01-12-2025, సోమవారం.. సూర్య దినపత్రిక లో.. "విరిసిన మొగ్గలు" అనే మా కంకణాలపల్లి విద్యార్థుల కథల సంకలనంపై  డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన సమ్రగ సమీక్ష